Delhi Vs Centre : కేంద్రం ఆర్డినెన్స్ పై దుమారం.. అందులో ఏముంది ?

ఢిల్లీ సర్కారు అధికారాలకు కత్తెర వేస్తూ కేంద్ర సర్కారు మే 19న ఇచ్చిన ఆర్డినెన్స్ పై దేశవ్యాప్తంగా వాడీవేడి చర్చ(Delhi Vs Centre) జరుగుతోంది.

  • Written By:
  • Publish Date - May 22, 2023 / 07:30 AM IST

ఢిల్లీ సర్కారు అధికారాలకు కత్తెర వేస్తూ కేంద్ర సర్కారు మే 19న ఇచ్చిన ఆర్డినెన్స్ పై దేశవ్యాప్తంగా వాడీవేడి చర్చ(Delhi Vs Centre) జరుగుతోంది. అది నిరంకుశ ఆర్డినెన్స్ అని బీజేపీ వ్యతిరేక కూటమిలోని పార్టీలు గొంతు చించుకుంటున్నాయి. ఈ విషయంలో రాజకీయ వైరుధ్యాలను పక్కకు పెట్టి  ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్ కు మద్దతును(Delhi Vs Centre) ప్రకటిస్తున్నాయి. ఆ ఆర్డినెన్స్ కు సంబంధించిన బిల్లు..  లోక్ సభ , రాజ్యసభ రెండూ ఆమోదిస్తేనే చట్టంగా మారుతుంది. అయితే దాన్ని రాజ్యసభలో ఓడిస్తామని బీహార్ సీఎం  నితీష్ కుమార్  అంటున్నారు. ఇందుకోసం బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్న ఆయన..  ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీ వాల్ ను కలిసి సంఘీభావం ప్రకటించారు. రాజ్యసభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు  110 మంది ఎంపీలే ఉన్నారు. కాంగ్రెస్ సహా అన్ని విపక్ష పార్టీలు కలుపుకొని 128 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. దేశంలోని విపక్షాలన్నీ ఏకమై ఆ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా  ఓటువేసి ఓడిస్తే.. 2024 ఎన్నికలకు ముందు ఇదే సెమీ ఫైనల్ అవుతుందని నితీష్ , కేజ్రీ వాల్ వ్యాఖ్యానించారు. ఈనేపథ్యంలో ఆ ఆర్డినెన్స్ పై కథనమిది..

also read : Nitish Kumar : విపక్షాల ఐక్యత కోసం నితీష్,తేజస్వి యాదవ్ ప్రయత్నాలు.. ఢిల్లీ సీఎంతో భేటీ.. వర్కౌట్ అవ్వుద్దా??

ఆర్డినెన్స్ లో ఏముంది ?

ఢిల్లీలో పాలనాధికారం అసెంబ్లీకే ఉంటుందని.. అధికారుల బదిలీలు, నియామకాల్లోనూ దానిదే తుది నిర్ణయమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం మే 11న తీర్పు ఇచ్చింది. దీన్ని పక్కన పెడుతూ మే 19న కేంద్రం కొత్త ఆర్డినెన్స్‌ తెచ్చింది. నగర పాలనపై అసాధారణ అధికారాలను లెఫ్టినెంట్‌ గవర్నర్‌ చేతుల్లో పెడుతూ ఆర్డినెన్స్‌ను జారీచేసింది. ఢిల్లీలో గ్రూప్‌-ఏ అధికారుల పోస్టింగ్‌, బదిలీలపై ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను తొలగిస్తూ.. దాని స్థానంలో కొత్తగా నేషనల్‌ క్యాపిటల్‌ సివిల్‌ సర్వీస్‌ అథారిటీని ఏర్పాటుచేసింది. ఫలితంగా ఢిల్లీలోని అధికారుల పోస్టింగ్‌, బదిలీలతో పాటు విజిలెన్స్‌ అధికారాలు ఎల్జీ చేతిలోకి వెళ్లాయి. నేషనల్‌ క్యాపిటల్‌ సివిల్‌ సర్వీస్‌ అథారిటీకి చైర్మన్‌గా ఢిల్లీ సీఎం ఉంటారు. మెంబర్లుగా సీఎస్‌,హోంశాఖ కార్యదర్శి ఉంటారు. ఢిల్లీలో ఏ అధికారిని బదిలీ చేయాలన్నా, పోస్టింగ్‌ ఇవ్వాలన్నా ఈ ముగ్గురు సమావేశమై, ఓటింగ్‌ నిర్వహించి ఎల్జీకి నివేదించాలి. మెజారిటీ ప్రతిపాదికన నిర్ణయం తీసుకుంటారు. ఎప్పుడైనా ఓటింగ్ లో ఫలితం తేలకుంటే.. లెఫ్టినెంట్ గవర్నర్ దే తుది నిర్ణయంగా ఉంటుంది. నగరంలోని పోలీస్‌ వ్యవస్థ మొత్తం ఇప్పటికే ఎల్జీ చేతిలో ఉంది. దేశ రాజధానిలో శాంతిభద్రతల బాధ్యత మొత్తం ఎల్జీదే. సివిల్‌ అధికారులపై ఢిల్లీ ప్రభుత్వానికి అజమాయిషీ ఉండేది. తాజా ఆర్డినెన్స్‌తో ఆ అధికారాలు కూడా లేకుండా పోయాయి.

also read : Jallikattu: జల్లికట్టును సమర్ధించిన సుప్రీంకోర్టు.. జల్లికట్టు అంటే ఏమిటి.. దశాబ్దాల నాటి ఈ కేసు సంగతేంటి..?

2015 నుంచే పవర్ వార్..

ఢిల్లీలో ఎవరి అధికారాలు ఏంటన్న దానిపై 2015 నుంచే వివాదం నడుస్తోంది. కేంద్రంలో మోడీ సర్కార్‌ రాగానే.. ఢిల్లీ పాలనాధికారాలను మొత్తం ఎల్జీ చేతిలో పెట్టింది. అప్పుడే కొత్తగా ఏర్పడిన అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌ ప్రభుత్వాన్ని డమ్మీని చేసేందుకే కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకున్నారన్న విమర్శలు వినిపించాయి. కేంద్రం నిర్ణయంపై కేజ్రీవాల్‌ ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు వెళ్లటంతో.. కేంద్రం నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. దీంతో కేజ్రీ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఈ వివాదాన్ని విచారించిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం.. ఎల్జీ, ఎన్నికైన ప్రభుత్వం మధ్య స్పష్టమైన అధికారాల విభజనను సూచిస్తూ ఈ నెల 11న తీర్పు ఇచ్చింది. ఢిల్లీ నగరంలో శాంతిభద్రతల బాధ్యత మాత్రమే ఎల్జీదని, ఇతర శాసన, కార్యనిర్వాహక బాధ్యతలు అసెంబ్లీకే చెందుతాయని తీర్పు ఇచ్చింది. అయితే సుప్రీం తీర్పు వచ్చి వారం కాక ముందే కొత్త ఆర్డినెన్స్‌ తెచ్చింది కేంద్రం. దేశ ప్రయోజనాల దృష్ట్యా నగరంలో అధికారాల సమతుల్యత కోసమే ఈ ఆర్డినెన్స్‌ తెచ్చామని కేంద్రం వాదిస్తోంది. ఈ రాజ్యాంగ విరుద్ధ నిర్ణయంపై వేసవి సెలవుల అనంతరం జులై 1న సుప్రీంకోర్టు తెరుచుకోగానే సవాల్‌ చేస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీ వాల్  స్పష్టం చేశారు.