Bird Flu : ప్రపంచంలోనే తొలిసారిగా ఓ వ్యక్తి బర్డ్ ఫ్లూ వ్యాధి సోకి చనిపోయాడు. ఈ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయిన తొలి మనిషి ఇతడే. ఈవివరాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా ధ్రువీకరించింది. హెచ్5ఎన్2 (H5N2) రకానికి చెందిన బర్డ్ ఫ్లూ వైరస్ సోకి మెక్సికోకు చెందిన 59 ఏళ్ల వ్యక్తి చనిపోయాడు. వాస్తవానికి బర్డ్ ఫ్లూ లక్షణాలతో ఇతడు ఈ ఏడాది ఏప్రిల్ 24న చనిపోయాడు. అతడి శాంపిల్స్ను ల్యాబ్కు పంపగా.. బర్డ్ ఫ్లూ వ్యాధి ఉందని తేలింది. దీనిపై మెక్సికో ఆరోగ్య శాఖ అధికారులు మే 23న ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)కు సమాచారాన్ని అందజేశారు. తాజాగా ఆ వివరాలపై WHO ఓ ప్రకటన విడుదల చేసింది.
We’re now on WhatsApp. Click to Join
బర్డ్ ఫ్లూ సోకడంతో మనిషి ప్రాణాలను కోల్పోయినట్లు ల్యాబ్లో నిర్ధారణ అయిన తొలి కేసు ఇదేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఆ వ్యక్తికి బర్డ్ ఫ్లూ ఎలా సోకింది ? అనే వివరాలపై ఇంకా స్పష్టత రాలేదని తెలిపింది. ఈ ఏడాది మార్చి నెలలో మెక్సికోలోని మిచోకాన్ రాష్ట్రంలో కోళ్లలో పెద్దఎత్తున బర్డ్ ఫ్లూ వ్యాపించిందని డబ్ల్యూహెచ్ఓ గుర్తు చేసింది. అయితే అప్పట్లో వ్యాపించిన బర్డ్ ఫ్లూ కేసులకు.. సదరు మెక్సికో వ్యక్తికి ఆ సమయంలో సోకిన బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్కు సంబంధం ఉన్నట్లు శాస్త్రీయ ఆధారాలేవీ ఇంకా లభించలేదన్నారు. కోళ్లలో ప్రబలే బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ మనుషులకు వ్యాపించడం అనేది జరిగే విషయం కాదని.. ఇందుకు చాలా తక్కువ అవకాశాలు ఉంటాయని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.
ఇక గత కొన్ని వారాలుగా అమెరికాలో కోళ్ల నుంచి ఆవులకు బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ వ్యాపిస్తోంది. H5N1 రకానికి చెందిన బర్డ్ ఫ్లూ వైరస్ ఇలా వ్యాపిస్తోందని గుర్తించారు. అయితే చాలా తక్కువ మంది మనుషులకే ఈ ఇన్ఫెక్షన్ సోకినట్లు వెల్లడైంది. ఈ తరహా బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ సోకిన వారిలో జ్వరం, శ్వాస ఆడకపోవడం, విరేచనాలు, వికారం వంటి లక్షణాలు బయటపడ్డాయి. అయితే మనుషుల నుంచి మనుషులకు బర్డ్ ఫ్లూ సోకిన కేసులేవీ ఇప్పటిదాకా అమెరికాలో వెలుగుచూడలేదు.