Site icon HashtagU Telugu

Hanuman Junction : హనుమాన్ జంక్షన్ కు ఆ పేరెలా వచ్చింది? ఆ ఆలయ చరిత్రేంటో తెలుసా?

New Project (5)

New Project (5)

Hanuman Junction : హనుమాన్ జంక్షన్.. ఈ ఊరు కృష్ణా, గోదావరి జిల్లాల సరిహద్దులో ఉంటుంది. ఇటు విజయవాడ నుంచి ఏలూరు, అటు గుడివాడ నుంచి ఏలూరు వెళ్లే హైవే లో ఈ ప్రాంతం కనిపిస్తుంది. ఒక చోట ఆంజనేయస్వామి విగ్రహం కూడా కనిపిస్తుంది. మీరు ఊహించినట్లే హనుమంతుని ఆలయం ఉంటుంది కాబట్టే హనుమాన్ జంక్షన్ అంటారు. ఈ ఆలయానికి 83 ఏళ్ల చరిత్ర ఉంది. ఆలయంలోని మూల విరాట్టు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటే.. మెట్లు మాత్రం కృష్ణా జిల్లా పరిధిలోకి వస్తాయి. బ్రిటిషర్ల కాలంలో.. నాలుగు రోడ్ల కూడలిని జంక్షన్ అని పిలిచేవారు.

ఏలూరు రోడ్డు, గుడివాడ రోడ్డు, నూజివీడు రోడ్డు, విజయవాడ రోడ్డు.. ఇలా నాలుగు రహదారులు హనుమంతుని ఆలయ సమీపంలో కలుస్తాయి. క్రమంగా అది హనుమాన్ జంక్షన్(Hanuman Junction) గా మారిపోయింది. 1983లో నూజివీడు ప్రాంతమంతా అప్పటి జమిందారైన ఎంఆర్ అప్పారావు పాలనలో ఉండేది. ఆయన తండ్రి మేకా వెంకటాద్రి బహద్దూర్ అప్పట్లో ఏదో పనిమీద ఈ జంక్షన్ కు వచ్చారట. ఆ సమయంలో ఆయనకు విపరీతమైన ఆకలి వేయగా.. వెంట వచ్చిన వారి వద్దకానీ, సమీప ప్రాంతంలో గానీ ఆహారం లభించలేదు. అప్పట్లే ఆ ప్రాంతంలో అంతా ముళ్లపొదలు, బీటలు వారిన భూములే కనిపించేవి. నిర్మానుష్య ప్రదేశంలో ఏమీ దొరకకపోవడంతో ఆకలిని తట్టుకోలేక ఒక చోట అలా కూర్చుండిపోగా.. వెంట వచ్చిన సేవకులు అలా నిలబడి ఉన్నారట.

ఇంతలో ఒక పెద్ద వానరం ఆయన వద్దకు వచ్చి తన చేతిలోని అరటి పండును ఆయన చేతిలో పెట్టి వెళ్లిపోయింది. దానిని తినగానే జమిందారుకు ఆకలి తీరడమే కాకుండా.. ఎంతో శక్తి వచ్చిన అనుభూతి కలిగిందట. తన ఆకలి బాధను చూడలేక.. సాక్షాత్తూ ఆ ఆంజనేయ స్వామే ఇలా వచ్చి ఆదుకున్నాడని భావించి.. ఆ ప్రాంతంలో నిలువెత్తు ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. ఆ తర్వాతి కాలంలో స్వామి వారికి ఎదురుగా.. రోడ్డుకు అవతలివైపు రామాలయాన్ని నిర్మించారు. కాలక్రమేణా ఆలయాన్ని విస్తరించి.. ప్రస్తుతం అక్కడున్న పెద్ద ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ జంక్షన్ మీదుగా వెళ్లేవారెవరైనా సరే.. ఆయనను స్మరించుకోకుండా వెళ్లరు.

Also Read :  Mahalaya Amavasya 2023 : మహాలయ అమావాస్య అంటే ఏమిటి ? ఆ రోజున ఏం చేయాలి ?