YS Sharmila – Sonia Gandhi : ఇవాళ, రేపు జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాల కోసం కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ హైదరాబాద్ కు వస్తున్నారు. ఈనేపథ్యంలో సోనియాతో షర్మిల ఇవాళ భేటీ అవుతారనే వార్తలు వినవస్తున్నాయి. ఇంతకుముందు కూడా రెండుసార్లు ఢిల్లీకి వెళ్లి సోనియా, కాంగ్రెస్ పెద్దలతో షర్మిల సమావేశమయ్యారు. అయితే షర్మిల పెట్టిన ప్రపోజల్స్ కు కాంగ్రెస్ పెద్దలు అంగీకారం తెలిపారా ? లేదా ? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ వాటికి ఆమోదం లభించి ఉంటే.. ఇవాళ సోనియా, రాహుల్ సమక్షంలో షర్మిల కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్లుగా ఆమె వెల్లడించే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.
ఇక ఇదే సమయంలో మాజీ మంత్రి తుమ్మల ఈ రోజు సోనియా సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. తుమ్మల సైతం పాలేరు అసెంబ్లీ టికెట్ కోసం పట్టబుట్టినట్లు సమాచారం. అయితే తుమ్మలతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ థాక్రే సమావేశమై, ఖమ్మం అసెంబ్లీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో షర్మిలకు పాలేరు సీటు ఇచ్చేందుకు లైన్ క్లియర్ అయిందని సంబంధిత వర్గాలు (YS Sharmila – Sonia Gandhi) చెబుతున్నాయి. ఇక ఏపీలోనూ షర్మిల సేవలను వినియోగించుకోవాలని తొలుత కాంగ్రెస్ నాయకత్వం భావించింది. అయితే తాను ఏపీకి వెళ్లే ప్రసక్తే లేదని, తెలంగాణకే పరిమితం అవుతానని తేల్చి చెప్పినట్లు టాక్.