కర్ణాటకలో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ .. ఇప్పుడు బలమైన పార్టీ క్యాడర్ కలిగిన తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈక్రమంలోనే త్వరలో మెదక్ లో పార్టీ అగ్రనేత ప్రియాంకా గాంధీతో(Priyanka Gandhi – Medak) బహిరంగ సభను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తోంది. రెండు రోజుల్లోగా దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. జూన్ చివరి వారం లేదా జూలై మొదటి వారంలో ప్రియాంకా గాంధీ సభ ఉండొచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈరోజు (సోమవారం) గాంధీభవన్లోని ప్రకాశం హాల్ లో జరగనున్న తెలంగాణ పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో దీనిపై చర్చ జరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు, కార్యవర్గం, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, డీసీసీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల చైర్మన్లు, టీపీసీసీ సభ్యులు హాజరవుతారు. ఈ మీటింగ్ లో తెలంగాణ అవతరణ దినోత్సవం నిర్వహణతోపాటు తాజా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు.
also read : YS Sharmila: షర్మిలపై’ DK’ ఆపరేషన్! త్వరలో ప్రియాంకతో భేటీ?
బీసీ డిక్లరేషన్ ను ప్రకటించేది అప్పుడేనా ?
గతంలో మెదక్ ఎంపీ స్థానం నుంచి ఇందిరాగాంధీ విజయం సాధించారు. గాంధీ ఫ్యామిలీకి మెదక్ తో ఉన్న సంబంధాన్ని మరోసారి తెలంగాణ ప్రజలకు గుర్తు చేసే లక్ష్యంతో .. అక్కడ ప్రియాంకా గాంధీ సభను(Priyanka Gandhi – Medak ) నిర్వహిస్తున్నారని అంటున్నారు. ఈ నెల 8న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ముగించుకొని ప్రియాంకా గాంధీ హైదరాబాద్కు వచ్చిన సందర్భంలో సరూర్ నగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ ను ప్రకటించారు. రానున్న రోజుల్లో కీలకమైన బీసీ వర్గాలు లక్ష్యంగా బీసీ డిక్లరేషన్ ను కాంగ్రెస్ పార్టీ ప్రకటించనుంది. మెదక్ లో జరగనున్న ప్రియాంకా గాంధీ సభలోనే బీసీ డిక్లరేషన్ను కాంగ్రెస్ పార్టీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు 6 నెలల టైమే ఉంది. ఈ తరుణంలో అన్నిసామాజిక వర్గాలకు ప్రత్యేక డిక్లరేషన్లు ప్రకటించి .. వాటిని జనంలోకి విస్తృతంగా తీసుకెళ్ళాలని రాష్ట్ర కాంగ్రెస్ యోచిస్తోంది. తద్వారా కర్ణాటక కాంగ్రెస్ గెలుపు సీన్ ను .. తెలంగాణాలో రిపీట్ చేయాలని భావిస్తోంది.