KTR: ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ విద్యార్థుల కోసం కేసీఆర్ నిరాహారదీక్ష చేశారు!

  • Written By:
  • Updated On - May 26, 2024 / 11:38 AM IST

KTR: తెలంగాణ భవన్ లో భారత రాష్ట్ర సమతి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ‘‘తెలంగాణ ఏర్పడి పదేళ్లు కావస్తున్న సందర్భంగా గత పదేళ్లలో ఉపాధి కల్పనలో మేము చేసిన అభివృద్ధిని చెప్పాల్సిన అవసరముంది. నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడింటి ప్రతిపాదికనే తెలంగాణ ఉద్యమం జరిగింది. ఉపాధి కల్పన రంగంలో కేసీఆర్ ప్రభుత్వం సాధించిన విజయాలను మీ ద్వారా తెలిపే ప్రయత్నం చేస్తాను. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ విద్యార్థులకు ఉద్యోగాల్లో జరిగిన అన్యాయం పై కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష చేశారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రపతి ఉత్తర్వులను ఇష్టానుసారంగా తుంగలో తొక్కినయ్’’ అని కేటీఆర్ మండిపడ్డారు.

‘‘జనరల్ కేటగిరీని నాన్ లోకల్ పేరుతో తెలంగాణ యువతకు ఎంతో అన్యాయం చేసింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. భారత దేశంలో ఏదైనా రాష్ట్రంలో అటెండర్ నుంచి గ్రూప్ వన్ దాకా 95 శాతం ఉద్యోగాలను స్థానికులే ఇచ్చిన రాష్ట్రమేదైనా ఉందా? కాంగ్రెస్, బీజేపీ లకు నేను సవాల్ చేస్తున్నా. దీనిపై సమాధానం చెప్పాలె. ప్రధాని వద్దకు వెళ్లి ఒత్తిడి తెచ్చి తెలంగాణలో స్థానికులకే 95 శాతం రిజర్వేషన్లు తెచ్చిన ఘనత కేసీఆర్ దే. 95 శాతం స్థానిక రిజర్వేషన్లు దేశంలో మన దగ్గర మాత్రమే ఉన్నాయి’’ అని కేటీఆర్ అన్నారు.

‘‘విద్యార్థులు, వారి తల్లితండ్రులు, నిరుద్యోగులు అంతా ఇది అర్థం చేసుకోవాలని కోరుతున్నా. ఉద్యమ నాయకుడు కేసీఆర్ మన తొలి ముఖ్యమంత్రి కావటం కారణంగానే ఇది సాధ్యమైంది. ఉమ్మడి రాష్ట్రంలో 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అప్పుడు మొత్తం రాష్ట్రంలో పదేళ్లలో వారు భర్తీ చేసిన ప్రభుత్వ ఉద్యోగాలు 24,086 మాత్రమే. అందులో 42 శాతం తెలంగాణను అనుకుంటే మనకు వచ్చింది 10 వేలు మాత్రమే. ఏడాదికి వెయ్యి ఉద్యోగాలే. కేసీఆర్ ఉద్యోగాలే ఇవ్వలేదంటూ కొంతమంది మాట్లాడుతుంటారు. వాళ్లు అర్థం చేసుకోవాలె’’ అని కేటీఆర్ అన్నారు.