Vishnu Matsya Avatara: మత్స్య జయంతి, విష్ణువు మత్స్యావతార విశేషాలు

ధర్మరక్షణ కోసం శ్రీమహావిష్ణువు దశావతారములు ఎత్తాడు. వీటిలో మొట్టమొదటి అవతారం ఈ మత్స్యావతారం. కొందరు మత్స్యావతారాన్ని జలావిర్భావానికి సూచికగా చెబుతారు.

  • Written By:
  • Updated On - March 24, 2023 / 09:32 AM IST

ధర్మరక్షణ కోసం శ్రీ మహా విష్ణువు (Sri Maha Vishnu) దశావతారములు ఎత్తాడు. వీటిలో మొట్టమొదటి అవతారం ఈ మత్స్యావతారం. కొందరు మత్స్యావతారాన్ని జలావిర్భావానికి సూచికగా చెబుతారు. బ్రహ్మకు ఒక పగలు అంటే – వెయ్యి మహాయుగాలు గడిస్తే ఆయన సృష్టిని ఆపి నిద్రపోతాడు. ఆసమయంలో ఈ సృష్టి అంతా ప్రళయం వచ్చి సర్వనాశనం అవుతుంది అని అంటారు. దీనినే నైమిత్తిక ప్రళయంగా చెబుతారు. ఈ ప్రళయ స్థితిలో వేయి మహాయుగాలు గడిచాక బ్రహ్మ మళ్ళీ యథాపూర్వంగా సృష్టిని ఆరంభిస్తాడు. దీనిని ‘కల్పం’ అని అంటారు.

మత్స్యావతారం అసలు కథ:

వరాహకల్పంలో ద్రవిడ దేశంలో సత్యవ్రతుడు అనే రాజు ఉండేవాడు. అతడు ధర్మాత్ముడు, విష్ణు (Vishnu) భక్తుడు. ఒకరోజు అతను కృతమాలా నదికి వెళ్ళి స్నానం చేసి , సూర్యునికి అర్ఘ్యం ఇస్తూండగా దోసిటలో చేపపిల్ల పడినది. రాజు దానిని నీటిలోనికి జారవిడిచాడు. మళ్ళీ నీటిని దోసిలి లోకి తీసుకున్నప్పుడు చేతిలోనికి చేప వచ్చి ఈ విధంగా పలికింది “రాజా ! నేను ఇక్కడే ఉంటే పెద్ద చేపలు తినేస్తాయి , దయచేసి నన్ను రక్షించు” అని ప్రార్థించినది. వెంటనే రాజు ఆ చేపపిల్లని ఒక పాత్రలో వేసాడు. మరుసటి రోజుకి ఆ చేపపిల్ల పాత్రపట్టనంత పెద్దది అయ్యింది. అప్పుడు రాజు దానిని చెరువులో వదిలిపెట్టాడు. ఆ మరుసటిరోజుకి ఆ చేపపిల్లకి చెరువు కూడా సరిపోలేదు. అ రాజు… ఆ చేపపిల్లని సముద్రంలో విడిచిపెట్టాడు. ఆ మత్స్యం (చేప) శతయోజన ప్రమాణానికి విస్తరించింది. అంతట ఆ మత్స్యం “తాను శ్రీమన్నారాయణుడుని అని, ఏడు రోజులలో ప్రళయం రానున్నదని, సర్వజీవరాశులు నశించిపోతాయి అని , ఈ లోకమంతా మహాసాగరమవుతుంది అని, నీవంటి సత్యవ్రతుడు నశింపరాదని” పలికింది. ఒకపెద్ద నౌకను నిర్మించి, అందులో పునఃసృష్టికి అవసరమగు ఔషధములు , బీజాలు వేసుకొని సిద్ధంగా ఉండమని, సప్తఋషులు కూడా ఈ నౌకలోనికి వస్తారని చెప్పింది.

మీనరూపంలో ఉన్న నారాయణుడు తన కొమ్ముకు మహాసర్ప రూపమైన తాడుతో నావను కట్టి , ప్రళయాంతం వరకు రక్షిస్తాడు. సాంఖ్యాయోగ క్రియాసహితమైన పురాణసంహితను రాజుకు ఉపదేశిస్తాడు. సత్యవ్రతుడు వివస్వతుడైన సూర్యునికి శ్రద్ధదేవునిగా జన్మించి , ‘వైవస్వత మనువు’ గా ప్రశిద్ధికెక్కాడు.

బ్రహ్మ మేల్కొని సృష్టి చేయాలని సంకల్పించగా వేదాలు అపహరణకు గురి అయ్యాయి. బ్రహ్మదేవుడు నిద్రావస్థలో ఉన్నప్పుడు అతని నోటినుండి వేదాలు జారి క్రింద పడగా , “సొమకాసురుడు” అనే రాక్షసుడు నాలుగు వేదాలని అపహరించి , సముద్రగర్భంలోకి వెళ్ళిపోయాడు. బ్రహ్మ శ్రీమన్నారాయణుని ప్రార్థించగా , అతను మత్స్య రూపంలో జలనిధిని అన్వేషించి సోమకాసురునితో పోరాడి , అతని కడుపుని చీల్చి.. వేదాలను – దక్షిణావృత శంఖాన్ని తీసుకొని , బ్రహ్మవద్దకు వచ్చాడు. శంఖాన్ని తానూ తీసుకొని , శిధిలమైన వేదభాగాలని బ్రహ్మను పూరించమని ఆజ్ఞాపించాడు. ఇది రెండో మత్స్యావతారం.

మత్స్య జయంతి విధి విధానాలు:

ఈ రోజు విష్ణుమూర్తికి (Vishnu Murthy) అంకితం చేయబడిన రోజు , కావున ఆలయంలో భజన కార్యక్రమాలు నిర్వహించడం , ఉపవాస దీక్ష గావించడం వంటి వాటి ద్వారా ఆ దేవుని కృపకు పాత్రులవగలరని పురాణాల సారాంశం. ఒకవేళ ఈ ప్రత్యేకమైన రోజు ఉపవాస దీక్షను మరియు పూజలను వేకువ జామునే ఆరంభించగలిగితే , అదృష్టం వరించి మోక్ష మార్గానికి దారి సుగమం అవుతుందని చెప్పబడింది. మోక్షం , హిందూమతం యొక్క అంతిమ లక్ష్యం. అయినప్పటికీ , ఈ ప్రత్యేకమైన ఉపవాస దీక్షలో , పూర్తిగా ఆకలితో ఉండాల్సిన అవసరం కూడా లేదు. పాలు పండ్లు స్వీకరించవచ్చు అని సూచించబడినది.

Also Read:  April 6 to May 2: వృషభ రాశిలో శుక్రుడి సంచారం.. 6 రాశుల వారిపై కనక వర్షం