Everest Man : అత్యంత ఎత్తయిన పర్వతం ఎవరెస్టు. దీన్ని అధిరోహించడం అంటే ఆషామాషీ విషయమేం కాదు. అయితే ఓ వ్యక్తి తాజాగా 29వసారి అవలీలగా ఎవరెస్టును అధిరోహించి సరికొత్త రికార్డును తన సొంతం చేసుకున్నాడు. అతడి పేరే కమీ రీటా షెర్పా. నేపాల్కు చెందిన 54 ఏళ్ల పర్వతారోహకుడు. ఎవరెస్టును ఎక్కువ సార్లు అధిరోహించిన వ్యక్తి కావడంతో ఇతడికి ఎవరెస్ట్ మ్యాన్ అనే పేరుంది. ఇంతకుముందు 28 సార్లు ఎవరెస్టును అధిరోహించిన కమీ రీటా షెర్పా(Everest Man).. తాజాగా 29వసారి కూడా అధిరోహించి తన రికార్డును తానే తిరగ రాసుకున్నాడు. ఈవిషయాన్ని నేపాల్ ప్రభుత్వం కూడా అధికారికంగా ధ్రువీకరించింది. మే 12న ఉదయం 7.25 గంటలకు ఎవరెస్టు శిఖరంపైకి కమీ రీటా షెర్పా చేరుకున్నాడని తెలిపింది.
We’re now on WhatsApp. Click to Join
గతేడాది ఇదే టైంలో కమీ రీటా షెర్పా 8848.86 మీటర్ల ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని వారంలో రెండుసార్లు అధిరోహించాడు. ఇటీవల మరోసారి ఎవరెస్టును అదేవిధంగా వారంలో రెండుసార్లు ఎక్కి వచ్చాడు. ‘‘ఇన్నిసార్లు.. అన్నిసార్లు అని కాదు.. ఎన్నిసార్లు ఎవరెస్టును ఎక్కాలనే దానిపై తాను ఇంకా లెక్కలు వేసుకోలేదు’’ అని కమీ రీటా షెర్పా స్పష్టం చేశాడు. ఈ మాటల ప్రకారం .. భవిష్యత్తులోనూ మరిన్ని సార్లు ఎవరెస్టును ఎక్కి.. ఎవరూ అధిగమించలేనంత రికార్డును క్రియేట్ చేయాలనే పట్టుదలతో అతడు ఉన్నాడని తేటతెల్లం అవుతోంది. పసాంగ్ దావా షెర్పా అనే మరో పర్వతారోహకుడు గత ఏడాది 27వ ఎవరెస్టును అధిరోహించాడు. అయితే ఆయన మరోసారి ఆ ప్రయత్నం చేస్తారా ? లేదా ? అనేది తెలియాల్సి ఉంది.
Also Read : Mothers Day 2024 : సండే రోజే ‘మదర్స్ డే’ ఎందుకు నిర్వహిస్తారు ?
ఎవరెస్టు ఎక్కిన ఆరేళ్ల భారతీయ బాలుడు
హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పుర్ జిల్లా జుఖాలా ప్రాంతానికి చెందిన ఆరేళ్ల బాలుడు యువన్ ఇటీవల ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్లో భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. ఆ బాలుడు తల్లిదండ్రులతో కలిసి తన లక్ష్యాన్ని సాధించాడు. యువన్ కొన్నేళ్లుగా తల్లిదండ్రులతో కలిసి దుబాయ్లో ఉంటున్నాడు. అతడు మొదటి తరగతి చదువుతున్నాడు. మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్కు చేరుకోవాలని ఉందని కొన్ని నెలల క్రితం తన తల్లిదండ్రులతో యువన్ చెప్పాడు. ఆ తర్వాత ట్రెక్కింగ్ కోసం యువన్ ఆరు నెలల పాటు శిక్షణ తీసుకున్నాడు. ఈక్రమంలో స్విమ్మింగ్, మార్షల్ ఆర్ట్స్, రన్నింగ్ అన్నీ నేర్చుకున్నాడు.