Site icon HashtagU Telugu

Heat Stroke Cases: దంచికొడుతున్న ఎండలు.. మార్చి- జూన్ మధ్య 40 వేలకు పైగా హీట్‌స్ట్రోక్ కేసులు!

Heat Stroke Cases

Heat Stroke Cases

Heat Stroke Cases: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండ తీవ్రతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సూర్యుడు.. ఆకాశం నుండి నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. దీని కారణంగా సాధారణ ప్రజలు పలువురు ప్రాణాలు కోల్పోయారు. పగటిపూట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్న ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాలను వేడిగాలులు ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. వేసవి కాలంలో దేశవ్యాప్తంగా 40,000 కంటే ఎక్కువ హీట్‌స్ట్రోక్ కేసులు (Heat Stroke Cases) నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా వేడిగాలుల కారణంగా ఇప్పటివరకు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

ఉత్తర భారతదేశంలో వేడిగాలుల కారణంగా మరణాలు పెరిగాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, హర్యానా వంటి రాష్ట్రాల్లో ఎండ తీవ్రతకు అనేక మంది చనిపోయారు. ఎండ వేడిమికి పక్షులు చెట్లపైనే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నెలకొంది. వాయువ్య భారతదేశంలోని రాష్ట్రాల్లో పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా డిగ్రీలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కారణంగా వేడి సంబంధిత కారణాలతో ఆసుపత్రులలో రోగుల సంఖ్య పెరుగుతోంది.

మార్చి- జూన్ మధ్య దేశంలో 40 వేలకు పైగా హీట్‌స్ట్రోక్ కేసులు

మార్చి 1- జూన్ 18 మధ్య 40,000 కంటే ఎక్కువ హీట్‌స్ట్రోక్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారిని ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది. ఈ సమయంలో కనీసం 110 మంది మరణాలు ధ్రువీకరించినట్లు తెలుస్తోంది. ఉత్తర-పశ్చిమ, తూర్పు భారతదేశంలో హీట్‌వేవ్ రోజుల సంఖ్య రెండు రెట్లు పెరిగింది. మధ్యప్రదేశ్‌లో మే నెలలో 5200 హీట్‌స్ట్రోక్ కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్‌లో హీట్‌స్ట్రోక్ కారణంగా అస్వస్థతకు గురైన వారి సంఖ్య 4300 కంటే ఎక్కువగానే ఉంది.

Also Read: Vastu Tips: మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ రావాలంటే.. ఈ వాస్తు పరమైన పనులు చేయాల్సిందే.. !

వేడిగాలుల కారణంగా ఏ రాష్ట్రంలో ఎంతమంది చనిపోయారు?

ఢిల్లీలో వేడిగాలుల కారణంగా 20 మంది మరణించగా, యూపీలో కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ఘజియాబాద్‌లోనే 30 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే నోయిడాలో 14 మంది చనిపోయారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం యూపీలోని 8 జిల్లాల్లో 44 మంది చనిపోయారు. బీహార్‌లో 29 మంది మరణించారని మీడియా నివేదికలలో పేర్కొంది. అయితే కొన్ని రోజుల క్రితం వరకు హీట్‌వేవ్ కారణంగా 45 మంది ప్రాణాలు కోల్పోయిన సమాచారం వెల్లడైంది.

NDTV నివేదిక ప్రకారం.. జూన్ 19 వరకు 6000 కంటే ఎక్కువ హీట్‌వేవ్ కేసులు నమోదయ్యాయని రాజస్థాన్ గురించి పేర్కొంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం వడదెబ్బ కారణంగా 16 మంది మరణించారు. దేశంలోని అనేక ఇతర రాష్ట్రాల్లో కూడా మరణాల కేసులు నమోదయ్యాయి. అయితే మరణించిన వ్యక్తుల మరణానికి కారణం వేడిగాలినా లేదా మరేదైనా అనేది పోస్ట్ మార్టం నివేదిక తర్వాత మాత్రమే తెలియనుంది.

We’re now on WhatsApp : Click to Join

ఢిల్లీలో 9 రోజుల్లో 192 మంది నిరాశ్రయులు మృతి

న్యూస్ ఏజెన్సీ పిటిఐ ప్రకారం.. జూన్ 11-19 మధ్య ఢిల్లీలో విపరీతమైన వేడి కారణంగా 192 మంది నిరాశ్రయులు మరణించారని నిరాశ్రయుల కోసం పనిచేస్తున్న ఎన్‌జిఓ ‘సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్‌మెంట్’ పేర్కొంది. గత 48 గంటల్లో ఢిల్లీలోని వివిధ ప్రాంతాల నుండి అణగారిన సామాజిక-ఆర్థిక నేపథ్యాలకు చెందిన 50 మంది మృతదేహాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే, వీరంతా వడదెబ్బ కారణంగా చనిపోయారా లేదా అనేది పోలీసులు, ఆరోగ్య అధికారులు ధృవీకరించలేదు.