చిక్కమగళూరులో రైతులు ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మార్కెట్ ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. చిక్కమగళూరు లో మాత్రం బీన్స్ వ్యాపారులు అత్యంత తక్కువ ధరలకు కొంటున్నారని రైతులు ఆరోపించారు. శనివారం రాత్రి చిక్కమగళూరులోని ఏపీఎంసీ యార్డు వద్ద వందలాది మంది రైతులు భారీ నిరసన చేపట్టి..ఏపీఎంసీ యార్డు గేటుకు తాళం వేశారు. ఈ విషయంపై జిల్లా యంత్రాంగం తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ వ్యాపారులకు, అధికారులకు వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు. ప్రస్తుతం మైసూరు, బెంగళూరు ఏపీఎంసీ మార్కెట్లలో బీన్స్ కిలోకు రూ. 85 నుంచి రూ. 90 మధ్య ధరలకు అమ్ముడవుతున్నాయని.. అయితే చిక్కమగళూరులోని వ్యాపారులు అదే పంటను కిలోకు కేవలం రూ. 40 నుంచి రూ. 60 కే కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల తాము భారీ నష్టాలను చవిచూస్తున్నామని తెలిపారు. మార్కెట్ ఉధృతంగా ఉండే ఈ సమయంలో స్థానిక వ్యాపారులు ఉద్దేశపూర్వకంగా ధరలను అణచివేసి, రైతులను దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తమ పంటకు సరైన ధరలు లభిస్తాయని ఆశించి మార్కెట్కు వస్తున్నామని.. ఇక్కడి వచ్చిన తరువాత తమకు ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయారు.ఆందోళన చేస్తున్న రైతులతో పోలీసులు చర్చలు జరిపారు. ఏపీఎంసీ ఉన్నతాధికారులు, వ్యాపారులు తమ సమస్యలను నేరుగా పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న రైతులు పట్టుబట్టారు. అయితే, రెవెన్యూ అధికారులు పదేపదే సంప్రదించడానికి ప్రయత్నించినప్పటికీ.. పలువురు ఏపీఎంసీ అధికారులు అందుబాటులో లేరని నిరసనకారులకు తెలిపారు. ఆ తరువాత తహసీల్దార్ రేష్మా, అసిస్టెంట్ కమిషనర్ నతేష్ నిరసన ప్రదేశాన్ని సందర్శించి రైతులతో చర్చలు జరిపారు. ధరల నిర్ధారణపై చర్చించి, రైతుల సమస్యలను పరిష్కరించడానికి డిప్యూటీ కమిషనర్తో త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని వారు నిరసనకారులకు హామీ ఇచ్చారు. అధికారుల నుండి హామీలు లభించడంతో రైతులు తమ ఆందోళనను విరమించుకోవడానికి అంగీకరించారు. ఈ నిరసన దాదాపు అర్ధరాత్రి వరకు కొనసాగింది. రాబోయే రోజుల్లో పంటకు ధరలు కల్పించకపోతే, జిల్లా వ్యాప్తంగా తమ నిరసనను తీవ్రతరం చేస్తామని రైతులు హెచ్చరించారు.
