సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసం మీదుగా ఒక గుర్తు తెలియని డ్రోన్ (Drone) ఎగురుతూ వెళ్లిందనే వార్తలు జాతీయ మీడియాలో వస్తున్నాయి. అయితే ఆ డ్రోన్ ఎక్కడిది ? ఎవరు పంపి ఉంటారు ? ఎందుకు పంపి ఉంటారు ? అనే దానిపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ డ్రోన్ ను చూసిన వెంటనే ప్రధానమంత్రికి రక్షణగా ఉండే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) అధికారులు ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించారు. ప్రధానమంత్రి నివాసం అనేది ప్రోటోకాల్ ప్రకారం.. నో ఫ్లై జోన్ లేదా నో డ్రోన్ జోన్ (No Drone Zone) పరిధిలోకి వస్తుంది. ఈ నిబంధనను ఉల్లంఘించి డ్రోన్ ను పంపేందుకు ఎవరు సాహసించారో తెలియాల్సి ఉంది.
మరోవైపు అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు ఆ డ్రోన్ను గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే దాని ఆచూకీ దొరకలేదు. “ప్రధానమంత్రి నివాసానికి సమీపంలో గుర్తుతెలియని డ్రోన్ చక్కర్లు కొట్టిందని మాకు సమాచారం అందింది. దీంతో ప్రధాని నివాసం సమీప ప్రాంతాల్లో క్షుణ్ణంగా సోదాలు చేశాము.. కానీ డ్రోన్ ను గుర్తించలేకపోయాం. దీనిపై దర్యాప్తు కోసం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ (ATC)ని వెంటనే సంప్రదించాం. వారు కూడా ఆ డ్రోన్ ను గుర్తించలేకపోతున్నామని చెప్పారు” అని ఢిల్లీ పోలీసులు ఒక ప్రకటనలో వెల్లడించారు.