ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్బీ) లాభాల బాటలో దూసుకుపోతున్నాయి. నిరర్థక ఆస్తులను పారదర్శకంగా గుర్తించి రికవరీకి చర్యలు తీసుకోవడంతో పాటు వడ్డీ ఆదాయం పెరగడం వల్ల అవి మంచి ఫలితాలను సాధిస్తున్నాయి. ప్రయివేటు బ్యాంకులకు పోటీగా సరికొత్త సంస్కరణలు తీసుకొస్తుండటం కూడా పీఎస్బీలకు లాభాలను పండిస్తున్నాయి. గత ఫైనాన్షియల్ ఇయర్ (2022-23)లో 12 ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్బీ) అన్నీ కలిసి రూ. లక్ష కోట్ల (1 Lakh Crores) నికర లాభాలను సంపాదించాయి. ఇందులో దాదాపు సగం వాటా.. అంటే రూ.50వేల కోట్లు స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)దే కావడం విశేషం. 2021-22లో వీటి నికర లాభం రూ.66,539.98 కోట్లు మాత్రమే. అది ఇప్పుడు 57% పెరిగింది.
also read : 3 Banks Collapse in a Week: అమెరికాలో ఏం జరుగుతోంది.. బ్యాంక్స్ దివాళాకు కారణాలేంటి?
2017- 18లో రూ.85,390 కోట్ల నికర నష్టాన్ని చవిచూసిన ప్రభుత్వ రంగ బ్యాంకులు.. ఐదేండ్ల తర్వాత (2022- 23)లో రూ.1,04,649 కోట్ల(1 Lakh Crores) నికర లాభాలు గడించడం గమనార్హం. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) మినహా అన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల పన్నేతర లాభాల్లో ఆకర్షణీయ గ్రోత్ రికార్డయింది. పీఎన్బీలో లాభం 2021-22తో పోలిస్తే 2022-23లో 27 శాతం తగ్గి రూ.3457 కోట్ల నుంచి రూ.2,507 కోట్లకు చేరింది. కాగా, 2023 మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగానూ స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.16,694.51 కోట్ల నికర లాభాన్ని గడించింది.