New Parliament : ఉదయం 7.30 టు మధ్యాహ్నం 2.30.. పార్లమెంట్ ప్రారంభోత్సవం ఇలా

కొత్త పార్లమెంట్ (New Parliament) ప్రారంభోత్సవాల షెడ్యూల్ విడుదలైంది.

  • Written By:
  • Updated On - May 26, 2023 / 07:26 AM IST

కొత్త పార్లమెంట్ (New Parliament) ప్రారంభోత్సవాల షెడ్యూల్ విడుదలైంది. ఈ గ్రాండ్  ప్రోగ్రామ్ ఈనెల 28న(ఆదివారం) ఉదయం 7.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2.45 గంటల వరకు కొనసాగనుంది. దాదాపు 7 గంటల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. పూజలతో ప్రారంభమై .. ప్రధాని మోడీ ప్రసంగంతో ఈ ఉత్సవం ముగుస్తుంది. 21 ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించగా.. టీడీపీ, బీజేడీ, బీఎస్పీ, వైఎస్సాఆర్ సీపీ, జేడీఎస్ సహా దాదాపు 25 పార్టీలు ఈ వేడుకకు హాజరు కానున్నాయి.

వేడుకల వివరాలు ఇవీ..

→ ఉదయం 7.30 గంటలకు పార్లమెంట్ (New Parliament) ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర హవనం, పూజలతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారు.

→ పూజ ముగిసిన తర్వాత.. ఉదయం 8.30 నుంచి 9 గంటల మధ్య లోక్ సభ స్పీకర్ సీటు దగ్గర “సెంగోల్” రాజదండాన్ని ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగా ‘అధీనం’ (తమిళనాడులోని శైవ మఠాల పూజారులు), చారిత్రాత్మక సెంగోల్ తయారీలో పనిచేసిన వుమ్మిడి బంగారు జ్యువెలర్స్, కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించిన వారిని ప్రధాని సన్మానించనున్నారు.

→ ఉదయం 9.30 గంటలకు పండితులు, సాధువులతో ప్రార్థనా సభ జరుగుతుంది.

→ పార్లమెంట్ ప్రారంభోత్సవ రెండో విడత కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటలకు జాతీయ గీతాలాపనతో ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా రెండు షార్ట్ ఫిలిమ్స్ ప్రదర్శిస్తారు.

→ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ స్వాగత ప్రసంగం చేస్తారు. ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి సందేశాలను కూడా చదివి వినిపిస్తారు.

→ రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ప్రసంగిస్తారు.

→ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రసంగిస్తారు. ఆ వెంటనే కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవాల  స్మారక నాణెం, స్టాంప్‌ను విడుదల చేస్తారు.

→  మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రధాని మోడీ ప్రసంగిస్తారు. దీంతో కార్యక్రమం ముగుస్తుంది.