బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ ఒక భారీ ఆర్థిక వివాదంలో చిక్కుకోవడం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. కర్ణాటకకు చెందిన ‘శివమ్ అసోసియేట్స్’ అనే సంస్థ దాదాపు రూ.2,400 కోట్ల మేర అక్రమ డిపాజిట్లు సేకరించి, ప్రజలను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ సంస్థ యజమాని శివానంద నీలణ్ణవర్పై ఇప్పటికే కేసులు నమోదు కాగా, ఈ అక్రమ సొమ్ము వ్యవహారంలో సన్నీ లియోన్కు కర్ణాటక సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్గా మారింది.
శివమ్ అసోసియేట్స్ అధినేత 2023లో ‘ఛాంపియన్’ అనే సినిమాను నిర్మించాడు. ఈ చిత్రంలో ఒక ఐటెం సాంగ్ చేసినందుకు సన్నీ లియోన్కు ఏకంగా రూ.1 కోటి పారితోషికం ఇచ్చినట్లు బ్యాంక్ రికార్డుల ద్వారా అధికారులు గుర్తించారు. ప్రజల నుంచి వసూలు చేసిన అక్రమ సొమ్మునే ఆమెకు రెమ్యూనరేషన్గా ఇచ్చారా అనే కోణంలో ఆరా తీస్తున్న పోలీసులు… దీనిపై పూర్తి వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతూ ఆమెకు నోటీసులు పంపారు.
ఈ సంస్థ ప్రజల సొమ్ముతో గత డిసెంబరులో నిర్వహించిన ‘కన్నడ ఉత్సవం’ వేడుకల్లో పలువురు సినీ నటులు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఈవెంట్లో పాల్గొన్నందుకు భారీగా పారితోషికాలు అందుకున్నారనే అనుమానంతో కన్నడ నటులు ‘డాలి’ ధనుంజయ్, సప్తమీ గౌడ (కాంతార ఫేమ్), వశిష్ఠ సింహ, రాగిణి ద్వివేదిలకు కూడా నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ సిద్ధమైంది.
