Pawan Kalyan: స్టీల్ ప్లాంట్ ఘటన..బాధితులకు పరామర్శ పవన్ కల్యాణ్
- Author : Vamsi Chowdary Korata
Date : 09-06-2026 - 1:57 IST
Published By : Hashtagu Telugu Desk
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖకు చేరుకున్న ఆయన కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. బాధితులను స్వయంగా అడిగి ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. అనంతరం స్టీల్ ప్లాంట్లోని ప్రమాద స్థలాన్ని పరిశీలించి యాజమాన్యం, ఉన్నతాధికారులతో మాట్లాడారు.
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని పవన్ హామీ ఇచ్చారు. ప్రమాదంలో మరణించిన రెగ్యులర్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.1.72 కోట్లు, ఒప్పంద కార్మికుల కుటుంబాలకు రూ.45.75 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించనున్నట్లు తెలిపారు. దీనితో పాటు మరణించిన వారి ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామన్నారు. గాయపడిన వారికి రూ.10 లక్షల తక్షణ సాయంతో పాటు చికిత్సకయ్యే పూర్తి ఖర్చులను రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ భరిస్తుందని వెల్లడించారు.
గత 30 ఏళ్లలో ఇలాంటి ఘోర దుర్ఘటన జరగలేదని పవన్ పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన ముందు రోజు రాత్రి కూడా ప్లాంట్లో ఇలాంటి చిన్న సాంకేతిక లోపం తలెత్తిందని, అయితే రాత్రి వేళ కార్మికులు ఎవరూ లేకపోవడం వల్ల ఎవరికీ తెలియలేదని తన దృష్టికి తెచ్చారని ఆయన వివరించారు. ప్లాంట్లో భద్రతా ప్రమాణాలు, యంత్రాల ఆధునికీకరణపై దర్యాప్తు చేయడానికి ఒక ప్రత్యేక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశామని, వారి నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
స్టీల్ ప్లాంట్ కార్మికుల సమస్యలపై, వారి భద్రతపై త్వరలోనే ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి స్వయంగా కార్మికులతో మాట్లాడతానని పవన్ హామీ ఇచ్చారు. ఇలాంటి ఘోర ప్రమాదాలు జరిగినప్పుడు కేవలం బాధపడి వదిలేయకుండా.. ఉద్యోగుల ప్రాణాలకు రక్షణ కల్పించేందుకు యాజమాన్యం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.