Nadendla Manohar: రేషన్ దుకాణాల్లో త్వరలో స్టీమ్‌ రైస్‌: మంత్రి నాదెండ్ల మనోహర్

రాష్ట్రంలో రేషన్ దుకాణాల ద్వారా నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. త్వరలో రేషన్ షాపుల్లో స్టీమ్ రైస్ పంపిణీ చేస్తామని, ఈ ఏడాది మధ్యాహ్న భోజన పథకంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయబోతున్నామని, ఎన్‌సీసీఎఫ్ సహకారంతో 1,000 మినీ మార్టులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ మినీ మార్టుల ద్వారా తక్కువ ధరకే నిత్యావసరాలను అందజేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ బియ్యానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో రేషన్ […]

Published By: HashtagU Telugu Desk
Steam rice to be available in ration shops soon: Minister Nadendla Manohar

Steam rice to be available in ration shops soon: Minister Nadendla Manohar

రాష్ట్రంలో రేషన్ దుకాణాల ద్వారా నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. త్వరలో రేషన్ షాపుల్లో స్టీమ్ రైస్ పంపిణీ చేస్తామని, ఈ ఏడాది మధ్యాహ్న భోజన పథకంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయబోతున్నామని, ఎన్‌సీసీఎఫ్ సహకారంతో 1,000 మినీ మార్టులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ మినీ మార్టుల ద్వారా తక్కువ ధరకే నిత్యావసరాలను అందజేస్తామన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ బియ్యానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో రేషన్ షాపుల ద్వారా స్టీమ్ రైస్ అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రేషన్ షాపుల్లో స్టీమ్ రైస్ పంపిణీ చేసేందుకు కేంద్రం అంగీకరించినట్లు ప్రకటించారు. రాష్ట్రంలో రేషన్ బియ్యాన్ని ప్రజలు పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా నాణ్యమైన బియ్యం సరఫరా చేస్తే అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టొచ్చన్నారు. ఈ స్టీమ్ రైస్‌ను మధ్యాహ్న భోజన పథకంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తామన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ మార్కెట్‌లో ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని.. అందుకే త్వరలోనే 1,000 మినీమార్టులు ఏర్పాటు చేస్తామని.. జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య (ఎన్‌సీసీఎఫ్‌) సహకారం తీసుకుంటామని చెప్పారు. ఈ మినీమార్టుల్లో కార్పొరేట్‌ రేంజ్‌లో రేషన్ కార్డులు ఉన్నవారికి తక్కువ ధరకే బియ్యం, ఇతర నిత్యావసరాలు అందేలా చూస్తామని చెప్పారు. పంచదార, గోధుమ పిండి, మిల్లెట్స్, పామాయిల్ వంటి నిత్యావసర సరుకులను రాయితీతో తక్కువ ధరలకే అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పౌరసరఫరాల శాఖ ద్వారా ఎన్నో సంస్కరణలు అమలు చేశామని మంత్రి మనోహర్ చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డులపై నేతల ఫోటోలు, పార్టీల రంగులు వేసుకున్నారని అన్నారు. విజయవాడ, విశాఖపట్నంలో పైలట్ ప్రాజెక్టుగా సీబీడీసీ (డిజిటల్ రూపాయి) వాలెట్ విధానాన్ని అమలు చేయబోతున్నట్లు తెలిపారు. ఈ వాలెట్ ద్వారా వినియోగదారులు తమకు నచ్చిన సరుకులు కొనుక్కునే వీలు ఉంటుందని చెప్పారు. రేషన్ బియ్యం మళ్లింపుపై చర్యలు తీసుకుంటున్నామని.. 5,354 కేసులు నమోదు చేశామని చెప్పారు. గత ప్రభుత్వం రైతులకు ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు చెల్లించకుండా పెండింగ్‌లో ఉంచారని అన్నారు. కూటమి ప్రభుత్వం రెండు విడతల్లో రూ.1,674 కోట్లు అకౌంట్‌లకు జమ చేసిందని, పౌరసరఫరాల సంస్థ, శాఖ ద్వారా చెల్లించామని చెప్పారు.

రాష్ట్రంలో మొత్తం 27వేల 756 రేషన్ షాపుల ద్వారా ప్రతి నెలా 16.88 లక్షల మంది వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దే రేషన్ పంపిణీ చేస్తున్నామని చెప్పారు. సిలిండర్ ధర పెరిగినా సరే రాయితీ క్రమం తప్పకుండా అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో అర్హులైన పీఎన్‌జీ లబ్ధిదారులకు రాయితీ అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 17.97 లక్షల మంది రైతుల నుంచి రూ.30వేల 361 కోట్లతో ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. రైతులకు 24 గంటల్లోనే డబ్బులు జమ చేశామని.. చిన్న రైతులు, కౌలు రైతులకు రూ.50 కోట్లతో టార్పాలిన్లు కొనుగోలు చేసి ఉచితంగా అందజేస్తున్నామని చెప్పారు. మొత్తం మీద ప్రజల కోసం పౌరసరఫరాల శాఖకు సంబంధించి త్వరలోనే మరికొన్ని మార్పులు రాబోతున్నాయి.

 

  Last Updated: 09 Jun 2026, 11:47 AM IST